ప్రభాస్ కొత్త సినిమా ‘రాధే శ్యామ్’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. కరోనా వల్ల రిలీజ్ ఆలస్యమైన ఈ సినిమా ఓటీటీ వేదికగా వస్తుందా, లేక థియేటర్ లలో విడుదలవుతుందా అనే సందేహాలను నివృత్తి చేస్తూ…చిత్ర నిర్మాతలు బుధవారం అధికారిక ప్రకటన చేశారు. మార్చి 11న ఈ ప్రతిష్టాత్మక సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. విడుదల తేదీ పోస్టర్ పై ప్రేమకు, విధికి జరిగిన అతి పెద్ద యుద్ధానికి సాక్షులుగా మారండి అంటూ ఆసక్తిని కలిగించారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా కథతో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందించారు. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథను తెరపై చూసేందుకు ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు వేచి చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ లలో ‘రాధే శ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.