‘ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి జరిపే చర్చలు వాటి అసలు లక్ష్యాన్ని దాటి వ్యక్తిగతంగా మారు తున్నాయి. ఈ నేపథ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారాల్ని రాబట్టడం అంత సులభం కాదు’ అన్నారు అగ్ర నిర్మాత డి.సురేష్బాబు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 13న హీరో వెంకటేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని థియేటర్స్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా డి.సురేష్బాబు శనివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘అభిమానుల కోరిక మేరకు..ఆమెజాన్ వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు మాత్రమే సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం. లాభాల్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం’ అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలోని సమస్యల గురించి మాట్లాడుతూ ‘టికెట్ రేట్లు ఎక్కువగా పెంచకూడదని నా అభిప్రాయం. మధ్యతరగతి వారికి సినిమా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాణ సంస్థ ఓ ఇండస్ట్రీగా మారి సొంత నియమాల్ని సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. తప్పు ఎవరిదో నిర్ణయించలేం. అందుకే ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం సాధించడం కష్టం’ అన్నారు. సంక్రాంతి బరిలో సినిమాల మధ్య పోటీ గురించి మాట్లాడుతూ ‘సంక్రాంతి సీజన్లో ఎవరైనా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆపే హక్కు ఎవరికీ లేదు. నా దృష్టిలో ప్రేక్షకులు చాలా నిజాయితీపరులు. వారికి నచ్చిన సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు’ అన్నారు.