‘నాని గ్యాంగ్లీడర్’ ‘శ్రీకారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది తమిళ సొగసరి ప్రియాంక అరుళ్ మోహన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పవన్కల్యాణ్ సరసన ‘ఓజీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఓ బంపరాఫర్ను సొంతం చేసుకుందని తెలిసింది. అగ్ర హీరో దళపతి విజయ్ సరసన ఈ భామ నాయికగా అవకాశాన్ని దక్కించుకుందని సమాచారం.
విజయ్ కథానాయకుడిగా వెంకట్ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. ప్రధాన నాయికగా జ్యోతిక పేరును ఇప్పటికే ఖరారు చేశారు. రెండో నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ను ఎంపిక చేయబోతున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఈ అమ్మడు తమిళంలో భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నది. తాజా అవకాశంతో ఈ భామ పాపులారిటీ పెరగడం ఖాయమని చెబుతున్నారు.