Pooja Hegde | సినిమాలలో ప్రత్యేక గీతాలకు సెపరేట్గా ఫ్యాన్స్ ఉంటారు. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. అందుకే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఐటెం సాంగ్లను రూపొందిస్తారు. అయితే గతంలో ఐటెం సాంగ్స్లో నటించడానికి ప్రత్యేకంగా భామలు ఉండేవారు. వీళ్ళకి పారితోషికాలు కూడా భారీగానే ఇస్తుంటారు. అయితే గత పది, పన్నెండేళ్ళ నుండి స్పెషల్ సాంగ్స్లో నటించడానికి స్టార్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్క పాటలో నర్తిస్తే చాలు కోటీకి పైగా పారితోషికాన్ని తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. నిర్మాతలు కూడా తమ సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్లో నర్తిస్తుందటే ఆ సినిమాకు రెట్టింపు క్రేజ్ వస్తుందని పారితోషికం విషయంలో వెనకాడకుండా కోట్లు ఇచ్చేస్తుంటారు.
ఇటీవలే ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ అనే సాంగ్ ఎంతటి విజయం సాధంచిందో అందరికి తెలిసిందే. సినిమా ఎంత హిట్టయిందో అందులో ఈ పాట కూడా అంతే హిట్టయింది. ఇటీవలే సమంత కూడా ఊ అంటావా పాట ప్రేక్షకుల మరింత దగ్గర చేసింది అని చెప్పింది. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరోయిన్ కూడా మరోసారి స్పెషల్ సాంగ్లో నర్తించడానికి సిద్దమైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే. ప్రస్తుతం సౌత్లో నంబర్ వన్ హీరోయిన్గా పూజా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు చేతుల సంపాదిస్తుంది. అయితే తాజాగా ఈమె మరోసారి స్పెషల్ సాంగ్లో నటించడానికి ముస్తాబవుతున్నట్లు టాక్.
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎఫ్-3’. అయితే ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించడానికి మేకర్స్ పూజాను సంప్రదించారట. పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.పూజా గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేల్ రాణి’ పాటకు స్టెప్పులేసింది. 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.