Guntur kaaram | టాలీవుడ్ సినీ జనాలు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న గుంటూరు కారం. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja hegde), శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారని తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి పూజాహెగ్డేను పక్కన పెట్టేశారన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
కొంతకాలంగా పూజా హెగ్డే సినిమాలు బోల్తా కొడుతున్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పూజా హెగ్డే నటించిన సినిమాలు దాదాపు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్గా పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలని మెయిన్ లీడ్ రోల్లో రీప్లేస్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే శ్రీలీల ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరిపోవడం కన్ఫామ్ అయినట్టే.
పూజాహెగ్డే స్థానంలో మలయాళ భామ సంయుక్తా మీనన్ను తీసుకుంటున్నారని మరో వార్త కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. గుంటూరు కారం ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతూ వస్తుండగా.. మేకర్స్ నటీనటులు, ఇతర సిబ్బందిని మార్చే పనిలో ఉన్నట్టు టాక్. రెండు నెలల బ్రేక్ తర్వాత జూన్ 24న ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ షురూ కానుందని తాజా సమాచారం.
గుంటూరు కారం చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడో సినిమా హ్యాట్రిక్ కావడం పక్కా అని ధీమాగా ఉన్నారు ఫ్యాన్స్ . ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. మహేశ్ బాబు మరోవైపు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేయబోతున్నట్టు సమాచారం.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..