‘ఇది పూర్తి కుటుంబకథాచిత్రం. ఇందులో రాజకీయ అంశాలేం ఉండవు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ దర్శకుడు మహేశ్చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు’ అని నిర్మాతలు దండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్ఎం మురళి(గోదావరి కిట్టయ్య) అన్నారు. డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా మహేశ్చంద్ర దర్శకత్వంలో వారు నిర్మించిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. పృథ్వీరాజ్, కేదార్శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా కీలక పాత్రధారులు. మే 1న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో చిత్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. నిర్మాతల్లో ఒకరైన ఎఫ్ఎం మురళి(గోదావరి కిట్టయ్య) మాట్లాడుతూ ‘నేను పిఠాపురంలో జర్నలిస్ట్ని. ఈ సినిమాలోని ఇంటిలాగే మా ఇల్లు కూడా మండువా లోగిలే. షూటింగ్ కోసం మా ఇల్లు అడిగారు. ఒకసారి లీవ్ పెట్టి మరీ షూటింగ్ చూశాను. సహజంగా అనిపించింది.
ఈ సినిమాలో భాగం కావాలనిపించి, నిర్మాణంలో భాగస్తుడిని అయ్యాను’ అని తెలిపారు. ప్రీమియర్స్ చూసినవారంతా కన్నీళ్లతో బయటకొచ్చారని, ఇందులో ప్రెసిడెంట్ పాత్రను రాజేంద్రప్రసాద్ అద్భుతంగా పోషించారని, శ్రీరామ్ స్క్రిప్ట్ని దర్శకుడు మహేశ్చంద్ర అద్భుతంగా తెరకెక్కించారని మరో నిర్మాత ఆకుల సురేశ్ పటేల్ చెప్పారు.