సినిమా కథలోని భావోద్వేగాలు హృదయాన్ని కదిలించాలని, అలాంటి చిత్రాలకే తాను పనిచేస్తానని చెప్పారు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. ఆయన ఛాయాగ్రాహణం అందించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా పీసీ శ్రీరామ్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
కథలోని ఎమోషన్స్ నచ్చడంతో ‘థాంక్యూ’ చిత్రానికి ఒప్పుకున్నా. నేటి ప్రపంచంలో మనుషులు ఆప్యాయంగా మాట్లాడుకోవడమే తగ్గిపోయింది. ఎవరి ప్రపంచంలో వారే బ్రతుకుతున్నారు. విలువలు పతనమవుతున్నాయి. వీటన్నింటికి దూరంగా మనందరం కృతజ్ఞతా భావంతో ఉండాలని, జీవితంలో పొందిన మేలుని గుర్తుతెచ్చుకుంటూ కృతజ్ఞతను చాటాలనే బలమైన పాయింట్ నన్ను బాగా ఆకర్షించింది. థాంక్యూ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ మాటతో మన హృదయంలోని భావాలు స్వచ్ఛంగా వ్యక్తమవుతాయి. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు తమకు నచ్చిన వారికి థాంక్స్ చెప్పాలనుకుంటారు.
క్రియేటివ్ విజన్ ముఖ్యం
సినిమాటోగ్రఫీలో టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులొస్తున్నాయి. ప్రతి రోజూ అప్డేట్ కావాల్సిందే. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్ను బట్టే దాని తాలూకు ఫలితం తెరపై కనిపిస్తుంది.
దర్శకత్వం చేయను
నేను ఏదైనా సినిమాకు పనిచేస్తే నా వర్క్ మిగతా విభాగాలన్నింటిని డామినేట్ చేస్తుందనే అపవాదు నిజం కాదు. దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా నా పనితీరు ఉంటుంది. తమ పనిపట్ల అభద్రతాభావంలో ఉన్నవారే నేను డామినేట్ చేస్తున్నానని అనుకుంటారు. సినిమా అంగీకరించే ముందు కథ మొత్తం వింటా. అప్పుడే నాకు దర్శకుడి విజన్ ఏమిటో తెలుస్తుంది. ఏదో చిన్న లైన్ చెప్పి సినిమా చేయమంటే సున్నితంగా తిరస్కరిస్తా. కథ చెప్పినప్పుడు అది నా హృదయానికి కనెక్ట్ కావాలి. నేను దర్శకత్వంలో రాణించలేకపోయా. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ రెండు భిన్న ధృవాల్లాంటివి. దర్శకత్వం నా వృత్తికాదు. అందుకే సక్సెస్ కాలేకపోయా. భవిష్యత్తులో ఇక దర్శకత్వం చేయను.