కేరింత ఫేమ్ పార్వతీశం (Parvateesam),జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య (Jabardasth Aishwarya) హీరోహీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం 1గా కొత్త సినిమా తెరకెక్కుతోంది. రామరాజు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండగా… “దేవరకొండలో విజయ్ ప్రేమకథ” చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ (Venkataramana S)తన ద్వితీయ ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సామాజిక నేపథ్యమున్న సరికొత్త ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుంది. వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థలో సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి నిర్మిస్తున్నారు.
ఈ నెల 25వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ…ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నామన్నారు.
నిర్మాత సిద్దార్థ హరియాల మాట్లాడుతూ…సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. తర్వాత హైదరాబాద్ లో జరిగే రెండో షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుంది. మొత్తం 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ సందేశాత్మక ప్రేమ కథలో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఈ చిత్రంలో చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ కుమార్ వై డైలాగ్స్ అందిస్తుండగా..జి అమర్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.