Parijatha Parvam | చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పారిజాతపర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనేది ఉపశీర్షిక. సంతోశ్ కంభంపాటి దర్శకుడు. మహీధర్రెడ్డి, దేవేశ్ నిర్మాతలు. ప్రచారంలో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. స్టార్ యాంకర్ సుమ కనకాల ఈ ట్రైలర్ని లాంచ్ చేసి యూనిట్కి శుభాకాంక్షలు అందించారు.
‘కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆర్పుతారట.. మళ్లీ లైట్స్ వేసేలోపు కేక్తోపాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’ అని సునీల్ తన గ్యాంగ్తో కిడ్నాప్ ప్లాన్ చెబుతుండగా ట్రైలర్ మొదలైంది. ట్రైలర్లోని ప్రధానపాత్రల చుట్టూ నడిపిన కిడ్నాప్ సీక్వెన్స్లు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయని, యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్తో సినిమా అలరిస్తుందని, సాంకేతికంగా అన్ని విభాగాలూ ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేశ్వాణి, సమీర్, గుండు సుదర్శన్, తోటపల్లి మధు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతి, సంగీతం: రీ, నిర్మాణం: వనమాలి క్రియేషన్స్.