Ott Movies | వాలెంటైన్స్ వీక్ సందర్భంగా అభిమానులకు ఓటీటీ ప్లాట్ఫామ్లు వరుస సర్ప్రైజ్లు అందించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో సందడి చేసిన భారీ చిత్రాల నుంచి మిస్టరీ, క్రైమ్, హర్రర్ జానర్ల వరకు పలు భాషల కంటెంట్ ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్కు రానుండటంతో వినోద ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి హాలీవుడ్ భయానక చిత్రాల వరకూ విభిన్నమైన సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు రెడీ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
కామెడీ టైమింగ్కు పేరుగాంచిన నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కూడా అదే రోజు నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ రూరల్ కామెడీ డ్రామా ప్రేక్షకులను నవ్వులతో అలరించిన సినిమా కావడంతో ఓటీటీలో కూడా మంచి స్పందన వస్తుందనే అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన గ్రామీణ క్రైమ్ డ్రామా ‘సంప్రదాయినీ సుప్పిణి సుద్దపూసని’ ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. చిత్తూరు బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథ గ్రామీణ వాతావరణం, సస్పెన్స్ అంశాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
హిందీలో సెన్సేషన్ సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కోహ్రా’ సిరీస్ రెండో సీజన్ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బరున్ సోబ్తి, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్సిరీస్కు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఫిబ్రవరి 11 నుంచి నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘బేబీ గర్ల్’ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. హాస్పిటల్లో పసికందు మాయమైన ఘటన చుట్టూ తిరిగే ఈ కథ సస్పెన్స్ ఎలిమెంట్స్తో నిండివుండగా, ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అభిమానుల కోసం ‘ప్రిడేటర్స్: బ్యాడ్లాండ్స్’ చిత్రం జియో హాట్స్టార్లో ఫిబ్రవరి 12 నుంచి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ కానుంది. అదే వేదికపై ఫిబ్రవరి 13 నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హర్రర్ ఫ్రాంచైజీ ‘ది కంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో హర్రర్ ప్రియులకు ఈ వీకెండ్ భయానక అనుభూతి ఇవ్వనుంది.
ఇక షార్ట్ ఫిల్మ్ అభిమానుల కోసం ఈటీవీ విన్లో ప్రసారమవుతున్న ‘కథా సుధ’ సిరీస్లో భాగంగా ‘గోల్డ్ & గీత’ అనే లఘు చిత్రం ఇప్పటికే స్ట్రీమింగ్లో ఉంది. అజయ్ కతువార్, దాక్షి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ భావోద్వేగ కథతో ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ వాలెంటైన్స్ వీక్లో ప్రేమకథలతో పాటు యాక్షన్, కామెడీ, క్రైమ్, హర్రర్, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్ల కంటెంట్ ఓటీటీలో అందుబాటులోకి రానుండటంతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి డిజిటల్ వినోద విందు సిద్ధమైంది.