పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఏదో మొహమాటానికి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.. గానీ తమ సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో విడుదల చేసేంత ధైర్యం మాత్రం ఎవరూ చేయడం లేదు. దాంతో అందరికీ ఇప్పుడు ఓటిటి శరణ్యం అయిపోతుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో డిజిటల్ రిలీజ్ అంటే అమ్మో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మన నిర్మాతలు కూడా మెల్లమెల్లగా ఆన్లైన్ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓటిటిల రాజ్యం మొదలవుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లలో విడుదల చేసినా కూడా కలెక్షన్లు రావడం లేదు.
మొన్న ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఎంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. చివరికి అక్కడక్కడ స్వల్ప నష్టాలతో బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకొని ఏం చేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మన నిర్మాతలు ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కరోనా పోయే వరకూ ఆగడం.. లేదంటే మంచి రేట్ వస్తే ఓటిటీలో విడుదల చేయడం. కొందరు చిన్న నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలు మాత్రం పరిస్థితులు చక్కబడే వరకు అలాగే బాక్సుల్లో ఉండబోతున్నాయి.
ఒకటి మాత్రం నిజం.. గతంతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓటిటి సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలిసేది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని అమెజాన్ తో పాటు ఆహా, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ఇలా అన్ని ఓటీటీలు ప్రేక్షకులకు బాగా చేరువ అయిపోయాయి. దానికి తోడు సినిమా విడుదలైన చాలా తక్కువ సమయంలోనే ఓటిటీలో వచ్చేస్తుంది. దాంతో థియేటర్లో ప్రేక్షకులు అడుగులు వేయడం కూడా మానేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రేపు పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా ఓటీటీ మన జీవితంలో భాగమైపోవడం గ్యారెంటీ. ఎంత కాదనుకున్నా కూడా థియేట్రికల్ కలెక్షన్స్ పై ఓటిటి ప్రభావం భారీగానే ఉండబోతుంది.