భారతీయ వెండితెరపై ఎన్నో అద్భుత దృశ్యకావ్యాల్ని సృష్టించారు అగ్ర దర్శకుడు మణిరత్నం. వ్యక్తిగతంగా మృదుస్వభావిగా, వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. అలాంటి మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సెట్లో కథానాయికలు ఐశ్వర్యరాయ్, త్రిషలపై కాస్త సీరియస్ అయ్యారట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు మణిరత్నం. చోళ సామ్రాజ్య నేపథ్య ఇతివృత్తంతో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ ఈ నెల 30న దేశవ్యాప్తంగా విడుదలకాబోతున్నది.
ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో మీడియాతో ముచ్చటించిన మణిరత్నం షూటింగ్ తాలూకు ఆసక్తికరమైన విషయాల్ని వివరించారు. ‘పొన్నియన్ సెల్వన్’ పతాకస్థాయి భావోద్వేగాలతో నడిచే చిత్రమన్నారు. షూటింగ్ సందర్భంగా నటీనటులందరూ కథ తాలూకు ఉద్వేగాల్ని ఫీల్ కావాలన్నది తన అభిమతంగా ఉండేదని తెలిపారు. అయితే ఐశ్వర్యరాయ్, త్రిష మంచి స్నేహితులు కావడం వల్ల ఒక్కోసారి సెట్లో వారిద్దరికి సీరియస్నెస్ ఉండేది కాదన్నారు. ఆ కారణంగా సన్నివేశాల్లో ఎమోషన్ మిస్సవుతుందనే భావన కలిగేదని చెప్పారు.
‘కొన్నిసార్లు వారిపై సీన్స్ సరిగ్గా వచ్చేవి కావు. దాంతో షూటింగ్ ప్యాకప్ చెప్పేవరకు ఇద్దరూ మాట్లాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చా. కొన్నిసార్లు కోప్పడ్డాను కూడా. ఏం చేసినా సినిమా కోసమే కాబట్టి నా అంతరంగాన్ని వారిద్దరి అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత షూటింగ్ సజావుగా సాగిపోయింది’ అని మణిరత్నం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ‘పొన్నియన్సెల్వన్-1’ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్ఇండియా స్థా యిలో రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు.