సినీ సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రకటనలతో కోట్లు ఆర్జిస్తున్నారు. అయితే కొన్ని సార్లు వారు చేసే ప్రకటనలు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కి యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ ఊహించని షాకిచ్చింది. వెంటనే పాన్ మసాలా సంబంధిత ప్రకటనల నుంచి వైదొలగాలని కోరుతూ సంచలన లేఖ రాసింది.
నాటో అధ్యక్షుడు శేఖర్ సల్కర్ తన లేఖలో పాన్ మసాలాలో పొగాకు ఉంటుందని, ఇది ప్రజలను వ్యసపరులుగా మారుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి వాణిజ్య ప్రకటనల నుంచి బిగ్ బీ వెంటనే తప్పుకోవాలని పేర్కొన్నారు. పాన్.. కేన్సర్ కారకంగా పనిచేస్తోందని, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్కు దారితీస్తాయని తేలిందని పేర్కొంటూ పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనలకు స్వస్తి చెప్పాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్ని కోరింది. ఆయన విజ్ఞప్తి మేరకు బిగ్బి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి.