సినిమా పరిశ్రమ ఎల్లలు చెరిపేసుకుందని..దక్షిణాది, ఉత్తరాది అనే భేదాలు కూడా లేవని చెప్పారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత నివ్వాలని, డబ్బింగ్ చిత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళంలో తెలుగు చిత్రాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విడుదలవుతున్నాయని, తెలుగులో మాత్రం తమిళ సినిమాలకు నిబంధనలు విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే తెలుగు సినిమాల్ని కూడా అడ్డుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై అల్లు అరవింద్ స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. డబ్బింగ్ చిత్రాల రిలీజ్ను ఆపడం సాధ్యం కాదని చెప్పారు. సినిమాకు ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవని, చక్కటి కథాబలం ఉన్న చిత్రాలు ఎక్కడైనా విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు.