నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటిస్తున్నది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా జూలై 22న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర మొదటి ట్రైలర్ విడుదల చేశారు. ద్వారకా నగర రహస్యాలు తెలుసుకునేందుకు డాక్టర్ కార్తికేయ అనే యువకుడు చేసిన సాహసోపేత ప్రయాణమే ఈ సినిమా నేపథ్యంగా తెలుస్తున్నది.
ట్రైలర్లో…కృష్ణుడే నడిపిన కథ ఇది అంటూ చెప్పడం ఆసక్తి కలిగిస్తున్నది. ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘మతాలు ఏవైనా మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది. దాని విశిష్టతను ఈ సినిమాలో చూపిస్తున్నాం. నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఇది. సీక్వెల్ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ‘కార్తికేయ 2’ ఎప్పుడనే అడిగేవారు. దర్శకుడు చందూ పూర్తి కథ సిద్ధం చేసుకున్నాక..సినిమా మొదలుపెట్టాం. సినిమా ప్రారంభించాక పాండమిక్ వచ్చింది. మూడేళ్లు మేము పడిన కష్టానికి రూపం ఈ ట్రైలర్. ఈ సినిమా మీకొక మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.
నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుంది’ అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..‘కార్తికేయ సినిమా ఎంత థ్రిల్లర్గా ఉంటుందో మీరు చూశారు. ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఆసక్తికరంగా సాగుతుంది’ అన్నారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ..‘ద్వారక నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంది. డాక్టర్ కార్తికేయ చేసే మరో సాహసం ఇది. ఆరేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కాబట్టి అంచనాలను దృష్టిలో పెట్టుకునే రచన, రూపకల్పన చేశాం.
దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నాం’ అన్నారు. ‘మొదటి ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టపడే చిత్రమిది. ఈ సినిమాలో ఎంతో శ్రమపడి నటించాము. మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది’ అని నాయిక అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.