కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్(Puneet Raj Kumar) ఆకస్మిక మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ మన మధ్య లేరు అంటే అది నమ్మశక్యంగా లేదని వాపోతున్నారు. తమ అభిమాన నటుడు ఇక లేరనే విషయం తట్టుకోలేని కొందరు గుండెపోటుతో కన్నుమూస్తుండగా, మరి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం చనిపోయిన పునీత్కి అభిమానులు పలు విధాలుగా నివాళులు అర్పిస్తున్నారు. ఉడిపి జిల్లా సాలిగ్రామకి చెందిన ఆటో డ్రైవర్ సతీష్ (35) సైతం పునీత్ మరణవార్త విని తట్టుకోలేక తన ఆటోను చేతితో బలంగా కొట్టడంతో రక్తస్రావం జరిగింది. రక్తతర్పణంతో తన నివాళి తెలియజేసుకున్నట్టు ఆ అభిమాని తెలిపాడు.ఇక మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత అక్కడే పునీత్ రాజ్కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు నూతన జంటని ఆశీర్వదించడంతో పాటు కొవ్వొత్తులు వెలిగించి పునీత్కు శ్రద్దాంజలి ఘటించారు. పెళ్లిలో వినూత్నంగా నివాళి అర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే పునీత్ లేడనే బాధతో అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.