Daggubati Venkatesh | హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
వివరాల్లోకెళితే.. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ అనే హోటల్ ఉండేది. దీనిని నందకుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తుండగా ఈ కిచెన్ ఉన్న స్థలం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందింది. అయితే, దీని లీజు పూర్తైనా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్ను రన్ చేస్తున్నారని దగ్గుబాటి ఫ్యామిలీ జీహెచ్ఎంసీకి కంప్లయింట్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ డెక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేశారు. అయితే డెక్కన్ కిచెన్ కూల్చివేయడంతో దాన్ని నిర్వహిస్తున్న నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసుపై స్టే ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే తాజాగా నందకుమార్ ఈ కేసుపై సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్లపై నాంపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇది నాంపల్లి కోర్టులో నేడు విచారణకు రాగా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. డెక్కన్ కిచెన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్పై ఐపీసీ సెక్షన్లు 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది.