సాఫ్ట్వేర్ రంగంలో విజయవంతంగా రాణించిన కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి దంపతులు ‘నాగబంధం’ చిత్రం ద్వారా సినీ నిర్మాతలుగా అరంగేట్రం చేస్తున్నారు. కేవలం డబ్బుకోసమే ఇండస్ట్రీకి రాలేదని, ఐటీ ఫీల్డ్లో తాము కావాల్సినంత గుర్తింపు పొందామని, వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో సినిమా గొప్ప వేదికగా కనిపించిందని వారు చెప్పారు. విరాట్కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన డివైన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ జూలై 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి శనివారం పాత్రికేయులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
మేమిద్దరం ఐఐటీ గ్రాడ్యుయేట్స్. ఐటీ నుంచి వచ్చినా…క్రియేటివ్ ఫీల్డ్ అయిన సినిమాపై తొలి నుంచి ఆసక్తి ఉంది. నిర్మాత రవీందర్ రెడ్డి ద్వారా దర్శకుడు అభిషేక్ నామాను కలిసి కథ విన్నాం. ఆయన విజన్ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటరయ్యాం. కథపై ఉన్న నమ్మకంతో 110కోట్ల బడ్జెట్తో సినిమా తీశాం.
రెండు కాలల నేపథ్యంలో నడిచే పీరియాడిక్ సినిమా ఇది. విజువల్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. భారీ సెట్స్లో చిత్రీకరణ జరిపాం. ప్రతీ పదినిమిషాలకొక అద్భుతమైన విజువల్ తెరపై కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వేసిన పద్మనాభస్వామి ఆలయం సెట్ని చూసిన అందరూ నిజమైన ఆలయానికి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు.
ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా వినూత్నంగా నిర్వహించాం. పద్మనాభస్వామి రథయాత్ర రూపంలో చేసిన ప్రచార కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇది చాలా ప్రత్యేకమని, ఈ తరహా ప్రమోషన్ ఎవరూ చేయలేదనే ప్రశంసలొచ్చాయి. ఈ పాన్ ఇండియా సినిమాకు అన్ని భాషల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది. బాలీవుడ్ విశ్లేషకులు ట్రైలర్ చూసి ప్రామిసింగ్గా ఉందని చెప్పారు.
సినిమా ఆశించిన విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ తెరకెక్కిస్తాం. ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త కథలు వింటాం.