Naga Chaitanya 25th Movie | తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya). చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన జాలర్లు గుజరాత్లో చేపల పట్టడానికి వెళ్లి అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు చిక్కుతారు. అయితే వీరిని భారత ప్రభుత్వం ఎలా బయటకు తీసుకువచ్చిందనే కథతో ఈ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ సినిమా అనంతరం నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం చైతూ కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతుండగా.. తన 25వ చిత్రం కోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలిసిన దర్శకులను కాకుండా ఈసారి కిషోర్ అనే కొత్త దర్శకుడితో తన 25వ చిత్రం చైతూ చేయబోతున్నాడని టాక్. కిషోర్ చెప్పిన కథ చైతన్యకి బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.