నటీనటులు: ఆథర్వ, నిమిషా సజయన్, చేతన్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, మహ్మద్ జీషన్ అయ్యుబ్ తదితరులు
దర్శకత్వం: నెల్సన్ వెంకటేశన్
నిర్మాత: సురేష్ కొండేటి
సహ నిర్మాత: సాయి చరణ్ తేజ పుల్లా
సినిమాటోగ్రఫి: పార్తీపన్
ఎడిటింగ్: వీజే సాబు జోసెఫ్
మ్యూజిక్: జిబ్రాన్ వాయిబోదా (బీజీఎం)
బ్యానర్: సురేష్ కొండేటి ఫిలింస్, ఒలంపియా మూవీస్
ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘DNA’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్పై నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో తెలుగులోకి విడుదల చేశారు. నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వ మలయాళం నటి నిమిషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి మై బేబీ అంటూ రావడంతో ఈ సినిమా ఎలా ఉందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ
ఈ చిత్రం ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా సజయన్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అవ్వడం వలన మందుకి బానిసగా మారతాడు. మరోవైపు దివ్య బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరిద్దరికి అనుకోకుండా పెళ్లి జరుగుతుంది. అయితే ఆనంద్ దివ్య మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమెను ప్రేమిస్తాడు. వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు.
ఈ క్రమంలోనే దివ్య గర్భవతి అవుతుంది, వారికి ఒక బాబు పుడతాడు. అయితే బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాలకే, ఆ బిడ్డ తమది కాదని, ఎవరో ఆసుపత్రిలో మార్చేశారని దివ్య పదేపదే చెబుతుంది. ఆమె మానసిక స్థితి కారణంగా మొదట ఎవరూ ఆమె మాటలు నమ్మరు. కానీ ఆనంద్ తన భార్య మాటలను నమ్మి, నిజం తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఆనంద్ తన బిడ్డను కనుగొనడానికి వెళ్లిన క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకునే ఒక పెద్ద నెట్వర్క్ను కనుగొంటాడు. అయితే ఈ నెట్వర్క్ని నడిపిస్తుంది ఎవరు. ఆనంద్ ఈ నెట్వర్క్ని ఎలా కనిపెట్టాడు. దివ్య తనకి పుట్టిన బిడ్డని మార్చేశారు అని ఎలా తెలుసుకుంటుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తమిళంలో ఘన విజయం సాధించిన DNA చిత్రాన్ని తెలుగులోకి మై బేబీ DNA పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఎంచుకున్న కథాంశం అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఆ కథాంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ఆయన చేసిన పరిశోధన, దాన్ని సన్నివేశాలుగా మలిచిన తీరు అద్భుతంగా ఆకట్టుకుంటుంది. కథ అనుక్షణం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతూ అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేక్షకుడిని చివరి వరకు ఊపిరి బిగబట్టి చూసేలా దర్శకుడు నెల్సన్ వెంకటేశన్. సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అనవసరం అని చెప్పడానికి వీలు లేకుండా ప్రతి ఫ్రేమ్ చాలా చక్కగా రూపొందించారు.
నటీనటులు
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమా కథలో ఆనంద్గా అథర్వ, దివ్యగా నిమిషా సజయన్, మరియు కానిస్టేబుల్గా బాలాజీ శక్తివేల్ల నటన హైలైట్గా నిలిచింది. బ్రేకప్ అయిన ప్రేమికుడిగా, బిడ్డను కోల్పోయిన తల్లి వేదనను అర్థం చేసుకుని న్యాయం చేయాలనుకునే భర్తగా, అలాగే తన కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే తండ్రిగా అథర్వ నటన చాలా బాగుంది. నటనతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అద్భుతంగా రాణించాడు. మానసిక సమస్యతో బాధపడే యువతిగా, పుట్టిన కొడుకు దక్కని తల్లిగా నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. ఇక అథర్వకు తోడుగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన బాలాజీ శక్తివేల్, తన ఫీల్గుడ్ పెర్ఫార్మెన్స్తో సినిమాను కొత్త జోన్లోకి తీసుకెళ్లాడు. మహ్మద్ జీషన్ అయ్యుబ్ పాత్ర నిడివి తక్కువే అయినా, గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు.
టెక్నికల్
ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను అందించిన జీబ్రాన్కు ఫుల్ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సెకండాఫ్ ఎమోషనల్ సీన్లలో, యాక్షన్ సన్నివేశాల్లో, అలాగే క్లైమాక్స్లో వచ్చే టెంపుల్ ఎపిసోడ్లో మ్యూజిక్తో జీబ్రాన్ అరిపించేశాడు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా తాము ఏ మాత్రం తక్కువ కాదనే విధంగా సినిమాను పరుగులు పెట్టించాయి. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. అలాగే పాత్రలకు నటీనటుల ఎంపిక చాలా బాగుంది.
చివరిగా స్క్రీన్ మీద నుంచి తల తిప్పకుండా చూసేలా ఈ సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూశాను అనే భావన మీకు కూడా కలుగుతుంది. థియేటర్లలో ఈ సినిమాను చూసి మంచి అనుభూతిని పొందండి.