MSG | మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రాంతీయ సినిమాల చరిత్రలో ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం విజయవంతంగా 25 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ఇప్పటివరకు సాధించిన వసూళ్ల వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.మొదటి 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతరం వచ్చిన పది రోజుల్లో దాదాపు రూ.17 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
మొత్తంగా 25 రోజుల్లో ఈ సినిమా రూ.375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను అందుకున్నట్లు సోషల్ మీడియాలో అధికారిక పోస్టు చేశారు. నాలుగో వారాంతంలో ఇంకా కొంత వసూళ్లు వచ్చే అవకాశముందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో చిరంజీవి ప్రాంతీయ సినీ రికార్డులను బ్రేక్ చేయడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. నిర్మాతలు మొదట రూ.400–500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసినా, ప్రస్తుతానికి రూ.375 కోట్ల వద్ద నిలిచింది. రూ.400 కోట్ల క్లబ్లో చేరాలంటే ఇంకా రూ.25 కోట్లు అవసరమున్న నేపథ్యంలో అది సాధ్యమవుతుందా లేదా అన్న చర్చ ట్రేడ్ వర్గాల్లో కొనసాగుతోంది. త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతున్నదన్న వార్తలు రావడంతో థియేటర్లలో భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.400 కోట్ల మైలురాయిని అందుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్ర విజయంతో చిరంజీవి ఎంతో సంతోషంగా ఉన్నారని, మెగాస్టార్ పేరుపై మరో ఇండస్ట్రీ రికార్డ్ నమోదవడంతో అభిమానులు కూడా సంబరాల్లో మునిగిపోయారని తెలుస్తోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు