ఈ ఏడాదిలోనే అత్యధికం
6 రాష్ర్టాల్లోనే ఎక్కువగా నమోదు
రాజస్థాన్లో రాత్రి కర్ఫ్యూ
న్యూఢిల్లీ/బెంగళూరు/జైపూర్, మార్చి 21: దేశవ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం నాటికి 24 గంటల వ్యవధిలో 43,846 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. గతేడాది నవంబర్ 26న ఒక్కరోజులో 44,489 కేసులు వెలుగుచూశాయి. అలాగే వ్యాధిబారిన పడిన వారిలో తాజాగా 197 మంది మరణించారు. ఒక్కరోజులో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం గత 97 రోజుల్లో ఇదే తొలిసారి. మరోవైపు తాజాగా నమోదైన కొత్త కేసుల్లో 83.14 శాతం కేసులు కేవలం ఆరు రాష్ర్టాల్లోనే వెలుగుచూశాయి.
మహారాష్ట్రలో 27,126, పంజాబ్లో 2,578, కేరళలో 2,078, కర్ణాటకలో 1,798, గుజరాత్లో 1,565, మధ్యప్రదేశ్లో 1,308 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 8 నగరాల్లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని విధించనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. కేసుల పెరుగుదల దృష్ట్యా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
సెకండ్ వేవ్ ప్రారంభమైంది: కర్ణాటక
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని కర్ణాటక ఆరోగ్యమంత్రి సుధాకర్ చెప్పారు. కరోనా కేసుల పెరుగుదలకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు, కరోనా టీకా తీసుకొన్నవారు రక్తాన్ని దానం చేయడంపై నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ (ఎన్బీటీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ఏ కంపెనీది అన్నదానితో సంబంధం లేకుండా.. టీకా రెండో డోసు తీసుకొన్న 28 రోజుల వరకు రక్తం దానం చేయవద్దని సూచించింది.
స్పీకర్ ఓం బిర్లాకు కరోనా
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం ఓం బిర్లా ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని డాక్టర్లు చెప్పారు.