‘విశాల్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అతని సినిమాలన్నీ బాగుంటాయి. నేను పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను. విశాల్ ఓ గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘పందెంకోడి’ తరహాలో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు సీనియర్ నటుడు మంచు మోహన్బాబు. సోమవారం తిరుపతిలో జరిగిన ‘లాఠీ’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశాల్ కథానాయకుడిగా ఏ.వినోద్ కమార్ దర్శకత్వంలో రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లాఠీ’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ‘నేను హీరో అవుతానని మా నాన్నతో చెప్పిన మొదటి వ్యక్తి మోహన్బాబుగారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. ‘లాఠీ’ కానిస్టేబుల్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వాళ్లు నిజ జీవిత హీరోలు. అందరికి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అన్నారు.