Raviteja | ప్రస్తుతం టాలీవుడ్ హీరోలపై బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది. హిందీ సినిమాల్లో టాలీవుడ్ హీరోలను తీసుకుంటే తెలుగులోనూ వసూళ్ల వరద ఖాయమని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. పైగా ఈ మధ్య హిందీలో మన హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది. హిందీ హీరోలతో పోల్చితే తెలుగు హీరోల సినిమాలే బాలీవుడ్ బెల్ట్పై కనక వర్షాలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు హిందీ సినిమాల్లో నటింపజేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది బ్రహ్మస్త్రలో నాగార్జున కీలకపాత్ర పోషించగా.. ఇక్కడ ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. లాల్ సింగ్ చడ్డాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు. అయితే ఇది బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టింది. ఇక ఇప్పుడు సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తుండగా.. చరణ్ గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. కాగా తాజాగా మరో హీరోపై బాలీవుడ్ మేకర్ ఖర్చీఫ్ వేశారు.
ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తిరిగి ఫామ్లోకి వచ్చిన రవితేజతో హిందీ మేకర్స్ ఓ రీమేక్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ధావణ్తో కలిసి రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. రెండేళ్ళ క్రితం తమిళంలో కాసుల వర్షం కురిపించిన మానాడు సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు. కాగా అందులో శింబు పాత్రలో వరుణ్ చేయగా.. ఎస్.జే సూర్య రోల్ను రవితేజ చేయనున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయట. ఈ సినిమాను రానా, ఏషియన్ సునీల్తో కలిసి కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.