OTT | మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులు మమ్ముట్టి, మోహన్లాల్ చాలా కాలం తర్వాత కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పేట్రియాట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్తో పాటు రాజకీయ నేపథ్యాన్ని కూడా కలిగి ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గత మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రానుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకోగా, జూన్ 5 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం ప్రసారం కానుంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన సినీ అభిమానులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశ భద్రత, నిఘా వ్యవస్థలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో మమ్ముట్టి డీఆర్డీవో అధికారిగా కనిపించగా, ఆయనపై వచ్చిన దేశద్రోహ ఆరోపణల వెనుక నిజాలను బయటపెట్టే కీలక పాత్రలో మోహన్లాల్ నటించారు. వీరిద్దరి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే ఈ చిత్రంలో నయనతార న్యాయవాది పాత్రలో నటించగా, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కుంచాకో బోబన్, రేవతి వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం, బలమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.