ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు సినీ అభిమానులని కలవరపరుస్తున్నాయి. ఒకరి విషాదం మరచిపోకముందే మరొకరు తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత, పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో కన్నుమూశారు. కళ్యాణ్ రామ్,సత్యదేవ్తో పలు సినిమాలు నిర్మించిన మహేష్ కోనేరు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలకు పీఆర్ఓగా కూడా పని చేశారు. మహేష్ నిర్మాణంలో 118, తిమ్మరసు,మిస్ ఇండియా చిత్రాలు రూపొందాయి.
మహేష్ మరణ వార్త విని ఎన్టీఆర్ షాక్ అయ్యారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా, నా మిత్రుడు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మహేష్ కోనేరు ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. మహేష్ కోనేరు అకాల మరణం టాలీవుడ్ కి నిజంగా తీరని లోటు ఆని అంటున్నారు. ఆ మధ్య సినీ హీరో సాయితేజ్ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు స్పోర్ట్స్ బైకుల వాడకం, బైకు రేసులు, నిర్లక్ష్యంగా, వేగంగా బండి నడపడం వంటి అంశాలపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాయితేజ్ ప్రమాద ఘటనపై పీఆర్ఓ మహేశ్ కోనేరు ఆసక్తికర విశ్లేషణ చేస్తూ ట్వీట్స్ చేశారు.అవి వైరల్గా మారాయి.