స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ను దసరా పండుగ ముందు జరుపుకుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు గానీ వచ్చే నెల మొదటి వారంలో గానీ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారని సమాచారం. ముహూర్తం పెట్టుకున్న రోజునే సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది ఏప్రిల్ 28గా ప్రకటించారు. అయితే చిత్రీకరణ ఆలస్యమవుతుండటంతో ఈ తేదీ కాస్త వెనక్కు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఏప్రిల్లో కాకుండా ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలి కాబట్టి ముందుగా అనుకున్న టార్గెట్ చేరుకోలేమని, మరికాస్త సమయం తీసుకోవాలని వారు భావిస్తున్నారని సమాచారం.