Lvanya Tripathi | టాలీవుడ్ ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి మళ్లీ సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. చాలాకాలం తర్వాత ఆమె నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా హీరో వరుణ్ తేజ్తో వివాహం, అనంతరం ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడుదల అవుతున్న ఈ సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. గతంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి)’ వంటి యూత్ఫుల్ చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, ఈసారి ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
లావణ్య త్రిపాఠి సరసన దేవ్ మోహన్ హీరోగా నటించగా, వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ సినిమా కుటుంబ బంధాలు, దాంపత్య జీవితం, వాటిలో వచ్చే సంఘర్షణలను వినోదాత్మకంగా చూపించనుందని నిర్మాత నాగమోహన్ తెలిపారు. హాస్యం, భావోద్వేగాలు కలగలిసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడిందని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యూ’ సర్టిఫికేట్ను పొందింది. మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ వీకే, కమేడియన్ సప్తగిరి, తమిళ హాస్యనటుడు వీటీవీ గణేష్, రాజేంద్రన్, జాఫర్, జోషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని మిక్కీ జే. మేయర్ అందించగా, సినిమాటోగ్రఫీని బినేంద్ర మీనన్ నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను సతీష్ సూర్య తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా, త్వరలోనే ట్రైలర్ను విడుదల చేసి ప్రమోషన్స్ను మరింత వేగవంతం చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి, ‘సతీ లీలావతి’తో లావణ్య త్రిపాఠి సక్సెస్ఫుల్ రీఎంట్రీ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.