Kriti Sanon | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి స్నేహాన్ని ఉద్దేశించి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్స్కు మరింత ఆజ్యం పోశాయి.
కృతి, వరుణ్ నటించిన ‘భేడియా’ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా నటుడు మాట్లాడుతూ.. ‘కృతి పేరు మరొకరి గుండెల్లో ఉంది.. ప్రస్తుతం అతను ముంబయిలో లేడు. దీపికా పదుకొణెతో షూటింగ్ నేపథ్యంలో వేరే ప్రాంతంలో ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని అనుకున్నారు.
కాగా, ఈ వార్తలపై కృతి సనన్ తాజాగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేశారు. ‘భేడియా ప్రమోషన్స్లో వరుణ్ ధావణ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్ని వెబ్సైట్లు నా పెళ్లి తేదీని కూడా ప్రకటించాయి. అందుకే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లు మాత్రమే’ అని ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా స్పష్టతనిచ్చింది.
ప్రభాస్, కృతిసనన్ జటంగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రామయణం నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను రూపొందించాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.