Krishnam Raju | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నటుడు కృష్ణంరాజు. లేటెస్ట్గా ఈయన ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటించాడు. ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత దాదాపు 7 ఏళ్లకు ఈ చిత్రంలో నటించాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. మర్చి 11న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రభాస్ తన ఇమేజ్కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు. ఈ క్రమంలో తాజాగా కృష్ణంరాజు ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
కృష్ణం రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ప్రభాస్ కలిసి ఇంతకుముందు నటించాం. ఈ సారి మా అమ్మాయి ప్రశీద కూడా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను ‘పరమహంస’ పాత్రలో కనిపిస్తాను. పరమహంస పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్లుందని ప్రభాస్ ఒక ఇంటర్వూలో చెప్పాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తున్నాను. ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళుతోంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ‘రాధేశ్యామ్’ కూడా ఇంత ఆలస్యమై ఉండేది కాదు. కరోనా ప్రభావం వలన కలిగిన ఆటంకాల వలన ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పాడు’ అని కృష్ణం రాజు పేర్కొన్నాడు.
‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ‘బాహుబలి’తో చూసి పోల్చొద్దని కృష్ణంరాజు వెల్లడించాడు. ప్రభాస్ ఏ చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకంటున్నారు అని అడగగా, మనవూరి పాండవులు చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇక రాధేశ్యామ్ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.