‘గొర్రెలను తీసుకొని అడవికి వెళ్లడం పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర. ‘కొండపొలం’ పుస్తకం చదివిన తర్వాత వెంటనే సినిమాగా తీయాలనిపించింది. గొర్రెలు కాసే యువకుడు అదే అడవిని కాపాడే ఫారెస్ట్ అధికారిగా వస్తాడు. ఈ పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది’ అన్నారు క్రిష్. ఆయన దర్శకత్వంలో వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించిన ‘కొండపొలం’ చిత్రం ఈ నెల 8న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రిష్..‘కొండపొలం’ అందరు గర్వపడే సినిమా అవుతుందని చెప్పారు. ‘లాక్డౌన్ సమయంలో ఎంతో రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాం. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఇదొక అద్భుతంగా మిగిలిపోతుంది’ అని నిర్మాత రాజీవ్రెడ్డి తెలిపారు. వైష్ణవ్తేజ్ మాట్లాడుతూ ‘మనలో ఒకడు అన్ని భయాల్ని అధిగమించి ధైర్యంగా నిలబడటం..ఏకంగా పులినే ఎదిరించడమే ఈ చిత్ర ఇతివృత్తం. ఎన్నిసార్లు క్రిందపడ్డా ముందుకువెళ్లాలనే ధైర్యాన్నిస్తుంది’ అని పేర్కొన్నారు. కొందరి జీవితాల్ని చూసి ఊహించుకొని ఈ నవల రాశానని..తెరపై తన భావనలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆ కార్యక్రమంలో హరీష్శంకర్, చంద్రబోస్, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు.