Vijay Thalapathy-Lokesh Kanagaraj Movie Villain | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నటిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకుడిగా, నటుడిగా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘సీతారామం’లో మేజర్ సెల్వన్గా నటించిన విషయం తెలిసిందే.
విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు టాక్.