వరుస విజయాలతో బాలీవుడ్లో అగ్రతారగా ఎదిగింది కియారా అద్వానీ. దక్షిణాది చిత్రాలు చేస్తూనే హిందీలో తన స్థానాన్ని కాపాడుకుంటున్నది. ఆమె తాజాగా ఓ స్విమ్మర్ బయోపిక్లో నటించబోతున్నది. చిన్న వయసులో అంటార్కిటికాలో ఓపెన్ స్విమ్మింగ్ చేసిన భక్తి శర్మ జీవిత కథను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ‘రాజీ’, ‘లూటెరా’ వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన భవానీ అయ్యర్ స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. ఈ సినిమా గురించి భక్తిశర్మ తల్లి లీనా శర్మ మాటల ద్వారా బయటకు తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో లీనా శర్మ మాట్లాడుతూ..‘నా కూతురు భక్తి శర్మ జీవిత కథతో సినిమా రానుంది. ఈ చిత్రంలో ఆలియా భట్ లేదా షెఫాలీ షా టైటిల్ పాత్రకు బాగుంటారని అనుకుంటున్నా. కానీ కియారా అద్వానీని తీసుకునే అవకాశాలున్నాయి. పిల్లల విజయంలో తండ్రి ప్రోత్సాహం ఉంటుంది కానీ మా అమ్మాయికి నేనే శిక్షణ ఇచ్చాను. ఇదొక సాహసోపేతమైన కథ’ అని చెప్పింది.