కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రేపు విడుదలవుతున్నది. నాగార్జున అతిథిగా బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ…‘నా కెరీర్లో ముఖ్యమైన సినిమా ఇది. మన జీవితాలతో ముడిపడి, మనం నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని కీలక అంశాలను ఈ చిత్రంలో చూపించాం. రెండు తరాలకు సంబంధించిన పాత్రల్లో నటించాను. వీటిలో 60 ఏళ్ల సర్దార్ పాత్ర ఆకట్టుకుంటుంది.
దేశం కోసం ఎన్నో సాహసాలు చేసే క్యారెక్టర్ అది. ఎలాంటి గుర్తింపు కోరుకోకుండానే దేశం కోసం పనిచేస్తాడు సర్దార్. నాగార్జున గారితో ‘ఊపిరి’ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మంచి నటుడు కావాలంటే మంచి మనిషిగా ఉండాలన్న ఆయన మాటలు నాకు స్ఫూర్తినిస్తాయి. అన్నపూర్ణ సంస్థ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. అప్పుడు దీపావళికి ‘ఖైదీ’ సినిమాతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు పండుగకు ఈ సినిమా తీసుకొస్తున్నాను. మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ..‘అన్న సూపర్ స్టార్గా ఉన్నప్పుడు తమ్ముడు స్టార్ అవడం అరుదుగా జరుగుతుంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా పేరు తెచ్చుకుంటే తమిళనాట సూర్య తమ్ముడిగా కార్తి స్టార్గా ఎదిగాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. నాతో ఊపిరి సినిమా చేశాడు. మా మధ్య అప్పటి నుంచి మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాలోనూ వైవిధ్యమైన కథతో మన ముందుకొస్తున్నాడు. ట్రైలర్ చూశాను చాలా బాగుంది. కార్తీ తన కెరీర్లో గర్వపడే సినిమా అన్నాడు. అన్నపూర్ణ సంస్థలో ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయికలు లైలా, రజీషా విజయన్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.