ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు బాలీవుడ్ భామలు కరీనా కపూర్, కృతి సనన్, టబూ. వీరు ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమా ‘ద క్రూ’. నష్టాల్లో ఉన్న ఎయిర్లైన్ సంస్థలో ఉద్యోగులుగా వీరు ఒక అసత్య ప్రచారంలో పడి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే కథాంశాన్ని వినోదాత్మకంగా చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కబోతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఏక్తా కపూర్, రియా చక్రవర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్ర ప్రకటన సందర్భంగా నాయిక కృతి సనన్ మాట్లాడుతూ…‘బలమైన కథా కథనాలు, పాత్రలు ఉన్న సినిమాల్లో నటించేందుకు ఇష్టపడతాను. అలా నేను కోరుకునే అంశాలున్న చిత్రమే ఇది. కామెడీ ఆఫ్ ఎర్రర్స్తో సరదాగా సాగుతుంది. కరీనా కపూర్కు నేను పెద్ద అభిమానిని. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అలాగే టబూతో తెర పంచుకోవడమూ ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు సెట్స్లో అడుగుపెడదామా అని వేచి చూస్తున్నాను’ అని చెప్పింది.