బరువు తగ్గేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కన్నడ టీవీ నటి చేతనా రాజ్ అస్వస్థతకు గురై మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. ‘గీత’, ‘దొరసాని’ వంటి సీరియల్స్లో నటించి బుల్లితెర వీక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారామె. సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. కొద్ది గంటలకే ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చేతనా రాజ్ మృతికి గుండెపోటు రావడమే కారణమని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే ఆమె చికిత్స చేయించుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మరణించిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.