‘కేజీఎఫ్’ సిరీస్, ‘కాంతార’ చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. విజయ్ కిరంగదూర్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాల్ని నిర్మిస్తున్నది. రాబోవు ఐదు సంవత్సరాల్లో తాము వినోద రంగంలో 3000కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘గత ఏడాది మా సంస్థకు గొప్ప విజయాలు దక్కాయి. భారతీయ వినోదరంగంలో రాబోవు ఐదేళ్లలో 3000 కోట్ల పెట్టుబడుల్ని పెట్టబోతున్నాం. వివిధ భాషల్లో వైవిధ్యమైన చిత్రాల్ని నిర్మించాలనుకుంటున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ తెలుగులో ‘సలార్’, మలయాళంలో టైసన్, ధూమమ్, కన్నడంలో డా॥ సూరి, రిచర్డ్ ఆంథోని చిత్రాలను నిర్మిస్తున్నది.