చిత్ర పరిశ్రమ గురించి, అక్కడి నటులు, దర్శకుల గురించి ఎప్పుడూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. తన అసహనాన్ని వారిపై ప్రదర్శిస్తుంటుంది. నిత్య జీవితంలోని తన ప్రతి కదలికను కొందరు కావాలని గమనిస్తున్నారని, తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలిస్తున్నారని తాజాగా ఆరోపించిందీ తార. కంగనా మాట్లాడుతూ..‘ఇప్పటి మాధ్యమాలకు సెలబ్రిటీ లైఫ్ అంటే చాలా ఆసక్తి అయిపోయిందని తెలుసు. బయట ఎక్కడికి వెళ్లినా వాళ్లు నన్ను అనుసరించడం సహజమే. అయితే ఈ మధ్య నా పార్కింగ్ ఏరియా, నా ఇంటి బాల్కనీ మీదకు కూడా లెన్స్లు జూమ్ అవుతున్నాయి. ఇవన్నీ స్త్రీలోలుడైన ఓ సెలబ్రిటీ చేయిస్తున్నాడని తెలిసింది. ఇలాంటి పనులకు ఆయన భార్యే అతన్ని ప్రోత్సహిస్తుండటం విచారకరం. పరిశ్రమలోకి వచ్చిన వారసుల్లో అతనూ ఒకరు. నా వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎక్కువ జీతాలతో పిలిపించుకుంటున్నారు. నా ఫోన్లోని వాట్సాప్ డాటా కూడా లీక్ అవుతున్నది. అందులోని నా వృత్తిపర, వ్యక్తిగత విషయాలు బయటకు వస్తుండటం ఆందోళనగా ఉంది’ అని చెప్పింది. ప్రస్తుతం కంగనా ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో మాజీ ప్రధాని ఇందిర పాత్రలో నటిస్తున్నది.