‘కల్కి 2898డి’ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు.. పాన్ వరల్డ్ సినిమా’ అని దర్శకుడు నాగ్అశ్విన్ ప్రకటించిన నాటి నుంచీ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపిక పదుకొనే, దిశాపటానీ.. ఇలా టాప్ స్టార్స్ ఈ చిత్రంలో భాగం కావడం, వందల కోట్ల నిర్మాణవ్యయంతో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం.. ఈ కారణాల వల్ల విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నది. తాజాగా లొకేషన్లోని స్టిల్స్ని దిశా పటానీ సోషల్మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ప్రభాస్తో దిగిన సెల్ఫీ కూడా ఉండటంతో ఈ స్టిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
అభిమానులైతే వీటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల నగారా మోగడంతో ఇప్పుడు ‘కల్కి’ విడుదలపై అనిశ్చితి నెలకొన్నది. వచ్చే నెల 13న తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికలతో పాటు, ‘కల్కి’ విడుదల కూడా ఆ వారంలోనే ఉండటంతో సినిమా విడుదల తేదీపై దర్శక,నిర్మాతలు ఆలోచనలో పడ్డట్టు ఫిల్మ్నగర్ వర్గాల టాక్. విడుదలను మే 30కి వాయిదా వేయాలని భావిస్తున్నట్టు కూడా రూమర్లు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.