Kajal Aggarwal | ప్రపంచవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతూ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న ఈ సమయంలో, సినీ రంగం కూడా సామాజిక బాధ్యతను గుర్తుచేసే కథల వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ చందమామగా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ ఓ ఆసక్తికరమైన ప్రయోగంతో ముందుకు వస్తోంది. పర్యావరణ కాలుష్యం, వ్యవసాయ రంగంలో రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల అధిక వినియోగం వల్ల తలెత్తుతున్న ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది ఇండియా స్టోరీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కేవలం ఒక కుటుంబం సమస్యగా కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజారోగ్యం మరియు భద్రతను ప్రభావితం చేసే పెద్ద సంక్షోభాన్ని ఈ కథలో ప్రతిబింబించనున్నారు.
ఈ చిత్రంలో పురుగుమందుల కుంభకోణాలు, వ్యవస్థలోని లోపాలు, నియంత్రణల లోటు వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ, సమాజాన్ని ఆలోచింపజేసేలా కథను రూపొందించినట్లు నిర్మాత సాగర్ బి షిండే వెల్లడించారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, మానవాళికి ఎదురవుతున్న తీవ్రమైన సంక్షోభమని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్తో పాటు శ్రేయస్ తల్పాడే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి నటన ఈ సినిమాను మరింత బలంగా నిలబెడుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. దర్శకత్వ బాధ్యతలను చేతన్ డికె చేపట్టగా, కథను కూడా సాగర్ బి షిండే అందించారు.
జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాటోగ్రఫీని నిశాంత్ భాగవత్ అందించగా, సంగీతాన్ని మంగేష్ ధక్డే సమకూరుస్తున్నారు.సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందిన ఈ సోషియో-నేషనల్ డ్రామా ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా, వినోదాన్ని కూడా అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే, కమర్షియల్ సినిమాల నుంచి కాస్త దూరంగా వెళ్లి, లేడీ ఓరియెంటెడ్ మరియు సామాజిక స్పృహ కలిగిన కథలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కుటుంబ జీవితాన్ని సమతౌల్యంగా కొనసాగిస్తూ, నటిగా తన ప్రయాణాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోంది.