అక్టోబర్10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారాలలో వేడి పెరుగుతుంది. మాటల తూటాలు పేలుస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఉండగా వీరు ఓటర్లని ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రకాశ్ రాజ్కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుండగా, మంచు విష్ణు పలువురు ప్రముఖుల సపోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నాడు. కృష్ణ, కృష్ణంరాజు, నరేష్ వంటి వారిని విష్ణు కలిసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో జీవిత తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తాను ఇటీవల ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ను కలిశానని చెప్పిన జీవిత.. ‘మా’ ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి తనకే ఓటు వేయాలని అభ్యర్థించగా ప్రస్తుత పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని అన్నారని, ఓటు వేసేందుకు రానని ఆయన తేల్చి చెప్పారని జీవిత పేర్కొన్నారు. ఓటు కూడా అడగొద్దని ఎన్టీఆర్ చెప్పారని, ప్రస్తుత పరిస్థితులు ఆయన చెప్పిన విధంగానే ఉన్నాయని అంటుంది.