Javed Akhtar | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమల్ సినిమాపై ఇంకా వివాదం కొనసాగుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఏం సందేశాలు ఇస్తున్నాయని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇక దీనికి కౌంటర్గా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ వంగా కూడా ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా సందీప్ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ స్పందించాడు.
యానిమల్ సినిమాపై జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడిపై నేను విమర్శలు చేయట్లేదు. ఒక డెమోక్రసీ కంట్రీలో నచ్చిన సినిమాను తీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. యానిమల్ లాంటి సినిమాలను ఒక్కటి కాకపోతే రెండు మూడు తీయమనండి. కానీ నా బాధంతా ప్రేక్షకుల గురించే. వారు ఇలాంటి హింసను ప్రేరేపించే చిత్రాలను చూసి ప్రేరణ పొందుతారు. నా 53 ఏండ్ల మూవీ కెరీర్లో నా సినిమాలలో సందీప్కు ఎక్కడా అసభ్య సన్నివేశాలు, మాటలు కనిపించలేదు. అందుకే నా కొడుకు నిర్మించిన మూవీని ఉదాహరణగా చూపించాడు. అందులో ఫర్హన్ నటించలేదు. నిర్మించాడంతే అంటూ జావేద్ వెల్లడించాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఔరంగాబాద్లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న జావేద్ అక్తర్ ప్రస్తుత సినిమా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్న యానిమల్ సినిమాను పరోక్షంగా ప్రస్తావించాడు. యానిమల్ లాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని తెలిపాడు. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం, అలాగే మరోక సీన్లో మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం వంటివి ఉంటాయి. అయితే ఇలాంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారిందని ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. అయితే దీనికి కౌంటర్గా సందీప్ స్పందిస్తూ ‘మిర్జాపూర్’ నిర్మించిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన తన తనయుడు ఫర్హాన్ అక్తర్కు ఎందుకు చెప్పలేదు. ఆ సిరీస్లో చాలా అసభ్య పదాలు ఉంటాయి. ఇప్పటివరకూ నేను దాన్ని చూడలేదు. మా సినిమాలపై వ్యాఖ్యలు చేసే ఆయన తన కుమారుడి వర్క్ను ఎందుకు చెక్ చేయడం లేదు అని ప్రశ్నించారు.
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.