అరంగేట్రం వరకే వారసత్వం, ప్రతిభ ఉంటేనే భవితవ్యం అని నిరూపించిన బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. ‘గుంజన్ సక్సేనా..ది కార్గిల్ గర్ల్’, ‘రూహీ’, ‘మిలీ’ వంటి నటనకు అవకాశమున్న చిత్రాలను ఎంచుకుంటూ నెపోకిడ్ ముద్ర నుంచి బయటపడి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇవాళ జాన్వీ కపూర్ పుట్టినరోజు. పాతికేళ్లు దాటి 26వ ఏట అడుగుపెడుతున్నదీ తార. పుట్టినరోజునా ఆమె తన కొత్త సినిమా షెడ్యూల్లో పాల్గొంటున్నది. క్రికెట్ నేపథ్యంగా సాగే ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ సినిమా షూటింగ్ కోసం ఆమె అహ్మదాబాద్ వెళ్తున్నది.
ఈ చిత్రంలో రాజ్కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నారు. దాదాపు నెల పాటు ఈ భారీ షెడ్యూల్ జరగనుంది. జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె తెలుగులో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న సినిమా నుంచి ఇవాళ ప్రకటన వెలువడనుందని సమాచారం. తన పుట్టినరోజు గురించి జాన్వీ స్పందిస్తూ…‘నా బర్త్ డే అంటే అమ్మా నాన్నలకు ఎంతో ప్రత్యేకం. గది నిండా అలంకరణలు చేసేవారు. కొన్నేండ్ల క్రితం తొలిసారి స్నేహితులతో కలిసి పుట్టినరోజున బయటకు వెళ్లాను. పుట్టినరోజున బహుమతులు అందుకోవడం కంటే ప్రేమించిన వారితో సమయం గడిపేందుకే ఎక్కువ ఇష్టపడతాను. నా దృష్టిలో అదే పెద్ద బహుమతి. బర్త్ డే పేరు చెప్పి షూటింగ్స్ నుంచి సెలవు తీసుకోను. నటిగా నాకు ప్రతి రోజూ ముఖ్యమేనని భావిస్తా’ అని చెప్పింది.