Janaganamana movie | రౌడి స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్గా ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అనన్యపాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్జోహర్, ఛార్మీలతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ చిత్ర షూటింగ్లోనే పూరి ‘జనగణమన’ కథను విజయ్కు చెప్పడం.. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయి. లైగర్ చిత్రం విడుదలకు ముందే జనగణమన షూటింగ్ను మొదలు పెట్టనున్నట్లు గతం నుంచే వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం పోస్ట్ పోన్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైగర్ చిత్రం తర్వాత విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు వచ్చాయట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక పూరి ప్రస్తుతం లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడట. దాంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాపై సమయం కేటాయించలేకపోతున్నాడట. ఇక లైగర్ తర్వాతే మళ్లీ జనగణమన సినిమా పనులను మొదలు పెట్టాలని పూరీ భావించాడట. దాంతో విజయ్ వెంటనే శివనిర్వాణతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడని సమాచారం.ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.