గత వారం విడుదలైన నలుగురు అగ్ర హీరోల చిత్రాలు భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత వందేళ్ల వారాంతపు వసూళ్ల రికార్డులను బద్దలు కొడుతూ 390 కోట్ల కలెక్షన్స్ సాధించాయి. రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘భోళా శంకర్’, అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్-2’, సన్నీ డియోల్ ‘గదర్-2’ చిత్రాలు వారాంతపు మూడురోజుల్లో (11వ తేదీ నుంచి 13 వరకు) దాదాపు నాలుగొందల కోట్ల వసూళ్లను సాధించాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
గత వారాంతంలో ఈ నాలుగు చిత్రాలను 2కోట్ల 10 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించారని ప్రొడ్యూసర్ గిల్డ్ గణాంకాలను విడుదల చేసింది. వారాంతాల్లో ఈ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం గత పదేళ్లలోనే అరుదైన రికార్డని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గదర్- 2 (135 కోట్లు), ఓ మై గాడ్-2 (43కోట్లు), జైలర్ (150 కోట్లు), భోళా శంకర్ (25కోట్లు) వసూళ్లను సొంతం చేసుకున్నాయని ప్రొడ్యూసర్ గిల్డ్ వెల్లడించింది. ‘భారతీయ సినీ చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టం. ప్రధాన స్రవంతి సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. థియేటర్ల వద్ద ప్రేక్షకుల కోలాహలం చిత్ర పరిశ్రమకు నూతన జవసత్వాలను అందించింది. తెల్లవారుజామున ప్రదర్శించిన షోలకు కూడా ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గొప్ప చిత్రాలను చూడటానికి భారతీయ ప్రేక్షకులు థియేటర్లకు మాత్రమే వస్తారని రుజువైంది. థియేటర్లలో వందలాది మంది మధ్య సినిమా వీక్షణం గొప్ప సామూహిక అనుభూతిగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్లకు తరలివస్తున్నారు. దర్శకనిర్మాతలు భాషాంతరాలను చెరిపివేస్తూ అద్భుతమైన కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు. ఈ ఏడాది భారతీయ సినిమా మరింత ఆశాజనకంగా ఉండబోతుందని ఈ ట్రెండ్ స్పష్టం చేస్తున్నది’ అని ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు శుభాషిస్ సర్కార్ పేర్కొన్నారు.