Director Venu Sriram | ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొన్ని సార్లు ఎంత కష్ట పడిన అదృష్టం లేకపోతే అవకాశాలు కూడా ఆమడ దూరంలో ఉంటాయి. అలా ఒక్కోసారి ఫ్లాప్ దర్శకులకు కూడా అవకాశాలు క్యూ కడుతుంటాయి. అదే కొంత మంది హిట్ దర్శకులకు ఎంత పెద్ద సక్సెస్ వచ్చిన అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే ఉంది. ‘ఓ మె ఫ్రెండ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వేణు శ్రీరామ్. ఈ సినిమా భారీ హిట్టు కాకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ మూవీ తర్వాత వేణు రెండో సినిమా ‘ఎంసీఏ’ చేయడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది.
మధ్యలో రవితేజ, రామ్చరణ్లతో కథలు ఓకే చేయించుకున్నా.. ముహూర్తం మొదలు పెట్టెలోపే రెండు ప్రాజెక్ట్లు అటకెక్కేశాయి. దాంతో ఏడేళ్ళ తర్వాత ఎట్టకేలకు నానితో ఎంసీఏ చేశాడు. కమర్షియల్గా ఈ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఇక ఈ సినిమా తర్వాత వేణుకు అవకాశాలు కొదవుండదు అని అందరూ భావించారు. కానీ మళ్ళీ సేమ్ సీన్ రిపీటైంది. ఎంసీఏ తర్వాత బన్నీ కోసం ‘ఐకాన్’ కథను సిద్ధం చేశాడు. బన్నీకు కూడా కథ తెగ నచ్చేసింది. ఇక రేపో మాపో సెట్స్ మీదకు వెళ్తుంది అనగా సినిమా ఆగిపోయింది. మళ్ళీ వేణు శ్రీరామ్ కథ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో తనకు వరుసగా రెండు చాన్స్లు ఇచ్చిన దిల్రాజును నమ్ముకుని మరో కథను సిద్ధం చేశాడు. అదే ‘వకీల్సాబ్’.
బాగా ఆకలితో ఉన్న మనిషికి చికెన్ బిర్యాని దొరికితే ఎలా ఉంటుందో వేణు పరిస్థితి కూడా అలానే ఉంది. ఏకంగా పవర్ స్టార్తో సినిమా చాన్స్ రావడంతో ఎగిరి గంతేశాడు. పైగా నాలుగేళ్ల బ్రేక్ తర్వాత పవన్ రీ ఎంట్రీ భాద్యతలు తన ఉండే సరికి ఒక వరంలా పొంగిపోయాడు. దాంతో హిందీలో బ్లాక్బస్టర్ హిట్టయిన ‘పింక్’ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి వకీల్ సాబ్గా తెరకెక్కించాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్తో పాటు క్రిటిక్స్ నుండి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు వేణు మరో సినిమా ప్రకటించలేదు.
వకీల్సాబ్ వచ్చి దాదాపు ఏడాదిన్నర అయిపోయింది. కానీ ఇంకా తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా తన తదుపరి చిత్రాన్ని రామ్చరణ్తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్తో సినిమా తర్వాత చరణ్ యూవీ బ్యానర్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ చరణ్ ఈ సినిమాను పక్కన పెట్టేశాడు. దాంతో గౌతమ్ ప్లేస్లో వేణు శ్రీరామ్ కొత్త కథతో రాబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు ముగిసాయని సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చరణ్ ఆర్సీ15 తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. కాగా ఈ రెండు సినిమాల తర్వాతే వేణు శ్రీరామ్ సినిమా పట్టాలెక్కనుంది.