మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం కార్యక్రమం హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హీరో చిరంజీవి, మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి వేణుగోపాల కృష్ణ, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ…‘తొలిసారి ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికుల ఘనతను చెప్పే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది. అమెరికా వెళ్లాల్సి ఉన్నా, ఈ కార్యక్రమం కోసం వాయిదా వేసుకున్నాను. గుండెల్లో ఎన్ని బాధలున్నా షూటింగ్లకు వచ్చి నవ్వుతూ పనిచేస్తారు కార్మికులు. సినీ కార్మికులు పనిగంటలు చూసుకోకుండా చిత్రీకరణల కోసం రాత్రీ పగలు కష్టపడుతుంటారు. ప్రపంచంలో ఎక్కువగా శ్రమించేది సినీ కార్మికులే అని చెప్పగలను.
ఎంతోమంది త్యాగాల మీద సినీ పరిశ్రమ నిలబడింది. కాళ్లు చచ్చుబడినా షూటింగ్ పూర్తి చేసిన గొప్ప నటుడు నూతన్ ప్రసాద్, విషాద వార్త తెలిసినా షూటింగ్ ఆపకుండా కొనసాగించిన కేబీ తిలక్ లాంటి వాళ్ల త్యాగం నేను చూశాను. నేనూ మీలో ఒక కార్మికుడినే. కార్మికులకు ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నా’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతున్నది. తెలుగు సినిమాకు కులం, మతం, ప్రాంతం వంటి బేధాలు లేవని నమ్మిన నాయకుడు కేసీఆర్. అందుకే సినిమా పరిశ్రమకు ఏ సౌకర్యాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. తెలంగాణ ఘనత చాటేలా సినిమాలు నిర్మించాలి. తెల్ల రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలన్నీ సినీ కార్మికులకు దక్కుతున్నాయి’ అన్నారు.