Hero Siddharth | పెబ్బేరు, మార్చి 27 : శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో బుధవారం సినీ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ వివాహం జరిగింది. అత్యంత గోప్యంగా, ఆంక్షల మధ్య ఉదయం 10 గంటలకు వివాహ తంతు పూర్తయింది. ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించనప్పటికీ.. వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లు గత మూడు రోజుల నుంచి చేస్తున్నప్పటికీ బయటికి పొక్కనివ్వలేదు.
ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. సినిమా షూటింగ్ కోసమని అందర్నీ నమ్మించారు. రెండు కుటుంబాలకు చెందిన పరిమిత సంఖ్యలో సభ్యులు హాజరు కాగా వరుడు సిద్ధార్థ్ వధువు అదితిరావును వివాహమాడారు. పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. పురోహితులను సైతం తమిళనాడు నుంచి రప్పించినట్లు తెలిసింది. ఆలయంలోనే భజంత్రీ వారు ఉన్నప్పటికీ ఆడియో వాయిస్ ద్వారా కార్యక్రమం పూర్తి చేశారు.
ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించకుండా బౌన్సర్లను కాపలా ఉంచి పెండ్లి తంతు నిర్వహించారు. పెండ్లి ఫొటోలు కూడా బయటకు రాకుండా ఆలయ సిబ్బంది, అర్చకుల ఫోన్లను సైతం స్వాధీనం చేసుకొని, తర్వాత ఇచ్చి వెళ్లారు. మీడియాను, స్థానికులను ఆలయ దరిదాపుల్లోకి కూడా అనుమతించలేదు. పెండ్లి కుమార్తె అదితిరావు ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావుకు సమీప బంధువు కావడంతో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సిద్ధార్థ్కు ఇది రెండో వివాహం. మొదటి భార్య మేఘనతో ఆయన 2017లో విడాకులు తీసుకున్నారు. అదితికి కూడా ఇది రెండో వివాహమే. గతంలో ఆమె సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరు 2012లో విడాకులు తీసుకున్నారు.