హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లక్ష్యం, ‘లౌక్యం’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయి. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమాకు రంగం సిద్ధమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. గోపీచంద్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్నివ్వగా టీజీ వెంకటేష్ కెమెరా స్విఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ శ్రీవాస్తో సినిమా చేయబోతుండటం ఆనందంగా ఉంది. భూపతిరాజా చక్కటి కథను అందించారు. సినిమాకు ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు’ అని తెలిపారు. ‘గోపీచంద్తో నేను చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది. గత చిత్రాలకు మించి యాక్షన్, ఎమోషన్స్, వినోదం ఉంటాయి. సంక్రాంతి తర్వాత సినిమాను సెట్స్పైకి తీసుకొస్తాం’అని శ్రీవాస్ చెప్పారు. కుటుంబ విలువలకు సామాజిక సందేశాన్ని మేళవించి రూపొందిస్తున్న చిత్రమిదని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి, కథ: భూపతిరాజా.