ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ హరిణి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సింగర్ గా మంచి పేరు తెచ్చుకొంది.ఆమె కుటుంబం ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది. అయితే వారం రోజుల క్రితం హరిణి కుటుంబం మిస్ అయినట్లు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. మరోవైపు హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై లభించడంతో ఏకే రావు ప్రమాదవశాత్తు రైలు నుండి పడి చనిపోయాడా లేదా ఎవరైనా చంపి రైల్వే ట్రాక్ పై పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో ఏకే రావు తన కుటుంబంతో కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత సుజనా పౌండేషన్ కు సీఈఓగా పనిచేస్తున్నారు. వారం రోజులుగా ఏకే రావు కార్యాలయానికి రాలేదని అక్కడ పనిచేసేవారు చెప్పారు. మూడు రోజుల క్రితం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఏకే రావు మృతదేహం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి ఫోన్లు పనిచేయని విషయాన్ని కనుగొన్నారు.
అయితే వారం నుంచి కనిపించకుండా పోయిన హరిణి, ఆమె కుటుంబీకులు ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇన్నాళ్లు ఏమైపోయారు , ఆయనను చంపాల్సిన అవసరం ఏముంది ఇలా రకారకాలుగా పోలీసులు విచారణ మొదలు పెట్టారు.